పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ రెండు చోట్లా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా రెండు చోట్ల పోటీ చేయాలని అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. దీంతో ఆయన చమ్కౌర్ సాహిబ్, బధౌర్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు. బధౌర్లో సీఎం చెన్నీ ఆప్ అభ్యర్థి లబ్సింగ్ ఉగోకే చేతిలో ఓడిపోయారు. ఆప్ అభ్యర్థికి 57,000 పై చిలుకు ఓట్లు వస్తే, చెన్నీకి 23 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక చమ్కౌర్ సాహిబ్లో సీఎం చెన్నీకి 50 వేల ఓట్లు వస్తే.. ఆప్ అభ్యర్థికి 54 వేల ఓట్లు వచ్చాయి. అంటే చమ్కౌర్ సాహిబ్లో సీఎం చెన్నీ ఆప్కు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్ కు గుడ్బై చెప్పేశారు. ఈ సమయంలోనే పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం చెన్నీని తెరపైకి తెచ్చింది. చెన్నీ సీఎం పీఠం ఎక్కడమే ఆలస్యం… అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. నవజ్యోత్ సింగ్ సిద్దూ వర్సెస్ చెన్నీగా మారిపోయాయి. ప్రతి రోజూ సిద్దూ సీఎం చెన్నీపై ఒంటికాలితో లేచేవారు. చివరికి సిద్దూకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది అధిష్ఠానం. అయినా సరే… వీరిద్దరి మధ్య కలహాలు మాత్రం తగ్గలేవు. ఇక.. దళిత వర్గానికి చెందిన చెన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాం కాబట్టి… బాగా కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఈ అంచనాలు చివరికి తుత్తునీయలయ్యాయి.