న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బీజేపీకే వెళ్లాయని ఆరోపించారు.
ప్రభుత్వం చేసిన సాయం, లబ్ధికి కృతజ్ఞతగా ఈ తరహాలో విరాళాలు ఇవ్వడం అనేది ఓ మార్గంగా మారిందని ఆరోపించారు. ఇటువంటి అపారదర్శకమైన ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థ ద్వారా డొనేషన్లు ఇచ్చేందుకు కార్పొరేట్లు ఎందుకంత ఆసక్తి చూపుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది అధికార పార్టీకి, కార్పొరేట్లకు మధ్య ఒక స్పష్టమైన అమరిక. నిశ్శబ్దంగా లబ్ధి చేకూర్చడం, అందుకు తగిన ప్రతిఫలాన్ని రహస్యంగా అందుకోవడం’ అంటూ చిదంబరం సోమవారం ట్వీట్ చేశారు.