న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశ ఆర్థిక పరిస్థితులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థించుకొనే ప్రయత్నాలు చేయడాన్ని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి వాటికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇతర బయటి అంశాలనే కారణమని మోదీ సర్కార్ చెప్పుకురావడాన్ని ఆక్షేపించారు. ధరల పెరుగుదలకు బయటి అంశాలే కారణమని బీజేపీ ప్రభుత్వం చేతులెల్తేసిందని, అలాంటప్పుడు వారు(బీజేపీ) అధికారంలో ఉంటడం ఎందుకని ప్రశ్నించారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘మీరు ప్రభుత్వంలో ఎందుకున్నారు? దేశంలోని సమస్యలతో పాటు బయటి ప్రతికూల పరిణామాలను ఎదుర్కొనే ప్రయత్నాలు చేయాలి. కనీసం ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ సర్కార్కు వాతలు పెట్టారు. డాలర్తో రూపాయి విలువ రూ.82కు పడిపోయినా, ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నామన్న కేంద్రం వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇతర కరెన్సీలతో పోల్చుకునేటప్పుడు, భారత తలసరి ఆదాయం ఆయా దేశాలకు సమానం కాదన్న విషయాన్ని చూడాలని హితవు పలికారు.
ద్రవ్యోల్బణానికి ఇంధన ధరలే మూల కారణమని, వెంటనే పన్నులను తగ్గించాలని చిదంబరం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘ఇంధనంపై సెస్ అనేది తన వనరులను పెంచుకొనేందుకు కేంద్రం స్వార్థపూరిత విధింపు. దీన్ని రాష్ర్టాలతో పంచుకోవడం లేదు. జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్నా యి. ఈ రోజు ద్రవ్యోల్బణం 7%, టోకు ద్రవ్యోల్బణం 12%గా ఉన్నది’ అని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే ముందు ప్రభుత్వం మేల్కోవాలని, కండ్లు తెరచి తగిన చర్యలు తీసుకోవాలని చిదంబరం హితవు పలికారు. దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వరల్డ్ బ్యాంకు(2022-23కు 7.5 నుంచి 6.5 శాతానికి తగ్గింపు) వంటి సంస్థలు తమ అంచనాలను సవరిస్తూ తగ్గిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.