రాయ్పూర్: గిరిజన మహిళలు కులాంతర వివాహం చేసుకోకుండా కట్టడి చేసేందుకు అక్కడి ‘సర్వ ఆదివాసీ సమాజ్’ వినూత్న నిబంధన తీసుకొచ్చింది. కులాంతర వివాహం చేసుకున్న గిరిజన మహిళకు ఒక లక్ష రూపాయల జరిమానా విధించనున్నట్లు ఫర్మానా జారీచేసింది. ఛత్తీస్గఢ్లోని అన్న గిరిజన సామాజిక వర్గాలకు ఈ సర్వ ఆదివాసీ సమాజ్ అనేది గొడుగు సంస్థ. ఆ రాష్ట్రంలోని అన్ని గిరిజన కులాలు ఈ సంస్థ నియమాలకు లోబడి ఉంటాయి.
కులాంతర వివాహాలు ఓ గిరిజన కులానికి, మరో గిరిజన కులానికి మధ్య గొడవలకు దారితీస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి గొడవలు మరింత పెరిగిపోయాయి. గిరిజన, గిరిజనేతర కులాల మధ్య గొడవలకు కూడా ఈ కులాంతర వివాహాలు దారితీస్తున్నాయి. దాంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్వ ఆదివాసీ సమాజ్ నేతలు తెలిపారు. నిబంధనను మీరిన మహిళ ఒకవేళ లక్ష రూపాయల జరిమానా చెల్లించకపోతే ఆమె కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.