రాయ్పూర్ : హిందూ రాజ్య నిర్మాణానికి పూనుకోవాలని చత్తీస్ఘడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా శర్మ (Aneeta Sharma) పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. పూరి శంకరాచార్య, స్వామి నిశ్చలానంద సరస్వతి జయంతోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మనమంతా ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి..హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతిన బూనాలి, హిందువులు ఐక్యంగా ముందుకు కదిలితేనే ఇది సాధ్యమవుతుందని అనితా శర్మ పేర్కొన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అనితా శర్మ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, దేశంలో భిన్న మతాల వారు సామరస్యంగా జీవిస్తున్నారని, దాన్ని తాము విచ్ఛిన్నం చేయబోమని పేర్కొన్నారు. తమ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఏకం చేసేందుకే భారత్ జోడో యాత్రను చేపడితే కాషాయ నేతలు మాత్రం సమాజంలో విభజన చిచ్చుకు కుట్ర పన్నుతున్నారని ఆమె మండిపడ్డారు.
Read More