న్యూఢిల్లీ : చత్తీస్ఘఢ్లో సీఎం భూపేష్ బాఘేల్, సీనియర్ నేత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ల మధ్య అధికార పోరు హస్తినకు చేరింది. పార్టీలో ఇరువురు నేతల మధ్య సాగుతున్న అధికార పోరుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వారిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పును ఆశిస్తున్న సింగ్ దేవ్తో పాటు సీఎం భూపేష్ బాఘేల్లతో పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పీఎల్ పూనియా కూడా పాల్గొంటారు.
కాగా బాఘేల్ సర్కార్ ఈ ఏడాది జూన్కు పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకోగా సింగ్ దేవ్ వర్గీయులు సీఎం పదవి రొటేషన్పై తమకు అప్పగించాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. సీఎం పదవి పంచుకోవడంపై కాంగ్రెస్ పార్టీ బాహాటంగా ఈ ఒప్పందాన్ని వెల్లడించకపోయినా ద్వితీయార్ధంలో సింగ్ దేవ్కు సీఎం పదవి ఆఫర్ చేస్తామని హైకమాండ్ అప్పట్లో హామీ ఇచ్చిందని ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. చత్తీస్ఘడ్లో నాయకత్వ మార్పుపై తాజా భేటీలో ఓ స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.