రాయపూర్ : చత్తీస్ఘఢ్లో నాయకత్వ మార్పు వ్యవహారంపై సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. సీఎం పదవి నుంచి వైదొలగాలని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎప్పుడు కోరితే అప్పుడు తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోనియా, రాహుల్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తాను సీఎం పదవిలో కొనసాగుతానని వారు తనను వైదొలగాలని కోరితే పదవి నుంచి తప్పుకుంటానని తాను గతంలోనూ వెల్లడించానని ఆయన గుర్తుచేశారు.
పార్టీలో అధికార పోరుకు తెరదించేందుకు రాహుల్ గాంధీ మంగళవారం బాఘేల్, సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్లతో చర్చించిన అనంతరం విలేకరుల సమావేశంలో బాఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రొటేషనల్ సీఎం అంశాన్ని తెరపైకి తెస్తున్నవారు రాజకీయ అస్ధిరత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని సింగ్ దేవ్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఇక రాహుల్తో జరిగిన భేటీలో పాల్గొన్న చత్తీస్ఘడ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పునియా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించారని, నాయకత్వ మార్పు అంశం ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు.