Punjab | పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ పోటీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా అడుగులు వేసింది. వచ్చే ఎన్నికల్లో చెన్నీ రెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. చమ్కౌర్ సాహబ్ అనే నియోజకవర్గంతో పాటు ఆదమ్పూర్ నుంచి కూడా చెన్నీ రంగంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం బుధవారం ప్రకటించనుంది. అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్దూ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో మాత్రం కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పంజాబ్ నేతలు పేర్కొంటున్నారు. మరో వైపు ఇప్పటి వరకూ అభ్యర్థుల మొదటి జాబితాను కూడా కాంగ్రెస్ విడుదల చేయలేదు. అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజుల్లోగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
పంజాబ్ను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అత్యంత బలీయమైన నేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీని వీడిపోవడంతో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిద్దూ కూడా అంతే రీతిలో పార్టీకి ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సోదరిని కాంగ్రెస్లో చేర్చే విషయంలో సిద్దూ సక్సెస్ అయ్యారు. ఇక మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను కూడా కాంగ్రెస్లోకి రప్పించేందుకు సిద్దూ తీవ్రంగా కృషి చేస్తున్నారు.