పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ దాదాపుగా తేల్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం బాధ్యతల్లో వున్న చరణ్ జిత్ సింగ్నే తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం రెడీ అయిపోయినట్లు సమాచారం. ఆయన పేరునే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని అధిష్ఠానంలోని ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సర్వేలో చన్నీయే అందరి కంటే ముందున్నట్లు తేలింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు, ఇతర శ్రేయోభిలాషులను సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుండునో పార్టీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వీరందరూ ప్రస్తుత సీఎం చెన్నీకే జై కొట్టారు. ఇద్దరే ఇద్దరు సీఎం రేసులో వున్నారు. అందులో ఒకరు సీఎం చెన్నీ, మరొకరు పీసీసీ అధ్యక్షుడు సిద్దూ. అయితే పార్టీ నిర్వహించిన సర్వేలో సిద్దూ వెనుకబడినట్లు తెలుస్తోంది.
ఇక.. కేవలం పార్టీ వారే కాకుండా పార్టీ ముఖ్యులు కొందరు సాధారణ ప్రజానీకానికి కూడా ఫోన్ చేసి, సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? అని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక 1.5 కోట్ల మందికి ఫోన్లు చేయాలన్న లక్ష్యంగా పంజాబ్ కాంగ్రెస్ ముందుకు కదులుతోంది. ఈ ప్రక్రియలో జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక అనేది అత్యంత పారదర్శకంగా జరగాలన్నదే పార్టీ అభిమతమని, అందుకే ఇంత పెద్ద ప్రక్రియను సాగిస్తున్నారని నేతలంటున్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాత్రం సీఎం చెన్నీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించే బాధ్యతను రాహుల్కు అప్పగించింది అధిష్ఠానం. ఆదివారం పంజాబ్ సీఎం అభ్యర్థిని రాహుల్ అధికారికంగా ప్రకటిచనున్నారు. రాహుల్ గాంధీ ఆదివారం లుథియానాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే రాహుల్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.