బెంగళూరు, ఏప్రిల్ 4: చంద్రయాన్-3 సక్సెస్ ఎంతోమంది జీవితాల్ని మార్చింది. ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నవారికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. అలాగే చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత మైసూర్కు చెందిన కేనస్ టెక్నాలజీ ఎండీ రమేశ్ కున్హికన్నన్ (60) ‘ఫోర్బ్స్ బిలియనీర్స్-2024’ జాబితాలో చోటుదక్కించుకున్నారు. 1.2 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.10వేల కోట్లు) సంపదతో ఆయన తొలిసారిగా ఈ రికార్డ్ను అందుకున్నారు.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్కు అత్యంత కీలకమైన ఎలక్ట్రికల్ పరికరాలు, ల్యాండర్, రోవర్లకు విద్యుత్ సరఫరా వ్యవస్థలను అందించింది ఆయన సంస్థే. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత టెక్నాలజీ రంగంలో ఆయన పేరు మారుమోగింది. కేనస్ టెక్నాలజీ షేర్ వాల్యూ నిరంతరం పెరుగుతూ వస్తుండటంతో, కంపెనీలో 64 శాతం వాటా కలిగిన ఆయన సంపద అనూహ్యంగా పెరిగింది.