న్యూఢిల్లీ, జూలై 24: జాబిల్లి గుట్టు విప్పేందుకు బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ వడివడిగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా ఈనెల 20న నాలుగో కక్ష్యను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక భూమికి 71351 x 233 కి.మీ దూరంలో తిరుగుతున్నది. స్పేస్క్రాఫ్ట్ ఈనెల 15న మొదటి కక్ష్య, 16న రెండో కక్ష్య, 18న మూడో కక్ష్య, 20న నాలుగో కక్ష్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఈనెల 25న ఐదో కక్ష్యలోకి ప్రవేశించనున్నది. మధ్నాహ్నం 2-3 గంటల మధ్య శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచనున్నారు. ప్రతి కక్ష్యను స్పేస్క్రాఫ్ట్ దాటుతూ చంద్రుడి వైపు పరుగులు పెడుతున్నది. శాస్త్రవేత్తలు థ్రస్ట్ ఇంజిన్ల వేగాన్ని పెంచుతూ కక్ష్యను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. అన్నీ కక్ష్యలను దాటిన తర్వాత చంద్రయాన్-3 భూ-చంద్రుడి ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్నది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి ఉపరితలంపై దిగనున్నది.
ఇటీవల చంద్రయాన్-3ను ప్రయోగించిన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. సింగపూర్కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ను ప్రయోగించనున్నది. దీంతో పాటు మరో ఆరు ఉప గ్రహాలను పీఎస్ఎల్వీ-సీ56 అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నది. ఈనెల 30న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. మొదటి లాంచ్ప్యాడ్ నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రయోగం నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ను సింగపూర్ డిఫెన్స్ సైన్స్, టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఈ శాటిలైట్ భౌగోళిక చిత్రాలను అందించనున్నది. వీటిని సింగపూర్ ప్రభుత్వంతో పాటు ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థ వాణిజ్య అవసరాలకు వాడుకోనున్నది.