ISRO | చంద్రయాన్-3తో విజయవంతంగా ప్రయోగించిన తర్వాత మన దేశంతోపాటు అంతర్జాతీయంగా ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదిలా ఉంటే చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించిన వీరముత్తువేల్ ప్రదర్శించిన దాతృత్వం అందరినీ ఆకర్షిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన ఎనిమిది మంది శాస్త్రవేత్తలను తమిళనాడు సర్కార్ సత్కరించింది. ఒక్కొక్కరికి రూ.25 లక్షల క్యాష్ గిఫ్ట్ అందించింది. ఇలా వచ్చిన క్యాష్ గిఫ్ట్ను తన పూర్వ విద్యార్థి సంఘాలకు డొనేట్ చేశారు. వీరముత్తువేల్.
విల్లుపురంలోని ఎలుమలై పాలిటెక్నిక్ కాలేజీ, తిరుచ్చిలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజీ, ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థుల సంఘాలకు ఈ రూ.25 లక్షలు సమానంగా డొనేట్ చేయాలని వీరముత్తువేల్ నిర్ణయించారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష పరిశోధనా శాఖ అదనపు కార్యదర్శి సంధ్య వేణుగోపాల్ శర్మ లేఖ రాశారు. గత నెల రెండో తేదీన ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్, వీరవముత్తువేల్ తోపాటు మొత్తం తొమ్మిది మంది శాస్త్రవేత్తలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సన్మానించారు.