Chandrayan-3 | బెంగళూరు, ఆగస్టు 16: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం 153x 163 కి.మీ కక్ష్యలో స్పేస్క్రాఫ్ట్ తిరుగుతున్నది. గురువారం మరో కీలక ఘట్టం జరగనున్నది. ప్రయోగంలో ఎంతో కీలకమైన ల్యాండర్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరుకానున్నది. ల్యాండర్ మాడ్యూల్లో భాగమైన ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరుకానున్నాయి. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ట్వీట్ చేసింది.