చండీగఢ్, జనవరి 30: పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు మంగళవారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారీ హైడ్రామా నడిచింది. బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ను ప్రిసైడింగ్ అధికారి విజేతగా ప్రకటించారు. మొత్తం 36 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు 12 ఓట్లు వచ్చాయి.
మిగిలిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మేయర్ ఎన్నిక ప్రకటన తర్వాత.. చేపట్టిన సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆ రెండు పోస్టులు కూడా బీజేపీకే వెళ్లాయి.
బీజేపీకి అనుకూలంగా ప్రిసైడింగ్ అధికారి!
ఏకంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంపై ఆప్, కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇందులో కుట్ర ఉన్నదని, ప్రిసైడింగ్ అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని విపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్లపై కొన్ని గుర్తులు రాసి చెల్లనివిగా ప్రకటించారని అన్నారు.
కౌంటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్ను తెరిచే సమయంలో తమ పార్టీ ఏజెంట్ను కనీసం పిలువలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బాక్స్ రావత్ అన్నారు. ప్రిసైడింగ్ అధికారి పాల్పడిన బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్ వ్యవహారం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరోపిస్తూ ఆప్, కాంగ్రెస్ ఒక వీడియో విడుదల చేశాయి.
ఆప్, కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. విపక్ష కౌన్సిలర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఫలితాన్ని సవాల్ చేసుకోవచ్చని బీజేపీ కౌన్సిలర్ సౌరభ్ జోషి అన్నారు. కాగా, ఆప్ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. మేయర్ ఎన్నికల ఫలితాన్ని పక్కనపెట్టి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.
ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు స్పష్టమౌతున్నదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికల్లోనే ఇలా చేశారంటే, లోక్సభ ఎన్నికల్లో వారు(బీజేపీ) ఎంత వరకైనా వెళ్తారనే దానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఇది ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ అని పేర్కొన్నారు.