Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2019లో జార్ఖండ్ ప్రజలు హేమంత్ సోరెన్ను సీఎంగా ఎన్నుకున్నారని, అలాంటి సీఎంను ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేయించిందని ఆయన విమర్శించారు.
జార్ఖండ్ రాష్ట్ర చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా వారి నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని చంపాయ్ సోరెన్ ఆరోపించారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నదో ఇప్పుడు దేశమంతా చూస్తున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హేమంత్ సోరెన్ సంక్షేమ పథకాలు కనిపిస్తాయని చెప్పారు.
మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఇవాళ ఆయన అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. రాంచి కోర్టు అనుమతితో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా బలపరీక్షలో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు.
కాగా, ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు హేమంత్ సోరెన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన తర్వాత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అధికార పక్ష ఎమ్మెల్యేల తీరును తప్పుపట్టారు. తన ప్రసంగ ప్రతిని రూపొంచింది ప్రభుత్వమేనని, ఆ ప్రతిని చదువుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే నినాదాలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు.
కాగా, జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో INDIA కూటమి నుంచి జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్కు 17 మంది, ఆర్జేడీ, సీసీఐ (ఎంఎల్) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంపాయ్ సోరెన్ బలపరీక్షలో సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అయితే తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య చెప్పారు.