TATA : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రతిష్ఠాత్మకమైన టాటా గ్రూప్ వశమైంది. వీటికి సంబంధించిన పూర్తి హక్కులను కేంద్ర ప్రభుత్వం గురువారం టాటా సంస్థకు బదలాయించింది. అప్పగింత ప్రక్రియలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ గురువారం ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఎయిరిండియా అప్పగింతల ప్రక్రియ విజయవంతమైనందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎయిరిండియా టాటా కంపెనీ వశమైన నేపథ్యంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం ఎయిరిండియా ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో ఏముందంటే…
‘ఎయిరిండియా తిరిగి టాటా సమూహంలోకే వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా వుంది. దీనిని తిరిగి ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాం. ఎయిరిండియా ఉద్యోగులందరికీ మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఉద్యోగులందరితో కలిసి నడవడానికి, కలిసి పని చేయడానికి సిద్ధంగానే వున్నాను. మనమందరమూ కలిసి దేశానికి ఏవిధంగా లాభం చేస్తామని యావత్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే ఎయిరిండియా టాటాల చేతికే తిరిగి వస్తుందన్న వార్త బయటికి వచ్చిందో అందరూ ఒక్కటే అన్నారు. ఘర్ వాపసీ అనే అన్నారు. ఇన్ని సంవత్సరాలకు తిరిగి ఎయిరిండియా టాటా సంస్థలోకి వచ్చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అందరిలాగే నేను కూడా ఎయిరిండియా చరిత్రను గుర్తుంచుకుంటాను. 1986 నుంచి ఎయిరిండియాతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఎంతో అనుభూతులున్నాయి. ఇవి ఎంతో ప్రత్యేకం. ఈ అనుభూతులను ఎన్నటికీ మరిచిపోలేను. నేడు ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశం దృష్టి అంతా మనమీదే వుంది. ఎయిరిండియాను కొత్త శిఖరాల వైపు తీసుకెళ్లాలి. అందుకు మనం చాలా కష్టపడాలి‘ అంటూ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉద్యోగులకు లేఖ రాశారు.