న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ (B.1.1529)ను గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణీకుల గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బోట్స్వ్వానా (3 కేసులు), దక్షిణాఫ్రికా (6 కేసులు), హాంకాంగ్ (1 కేసు)లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల కోసం సవరించిన మార్గదర్శకాలలో సూచించిన ఇతర ‘ప్రమాదకర’ దేశాల నుండి ప్రయాణించే వారితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చే ఆయా అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తెలిపింది. వారిని కలిసిన వారిని కూడా తప్పనిసరిగా ట్రాక్ చేసి కరోనా టెస్ట్లు చేయాలని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య కార్యదర్శులకు గురువారం లేఖలు రాశారు.