న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) అమలును జమ్ము కశ్మీర్లో రద్దు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించి, ఆ రాష్ట్ర శాంతిభద్రతల్ని అక్కడి పోలీసులకు వదిలేయాలని భావిస్తున్నామన్నారు. ‘అక్కడున్న కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని భావిస్తున్నాం.’ అని అన్నారు. ఏఎఫ్ఎస్పీఏ ద్వారా సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలు దఖలు పడతాయి. ఎక్కడైనా, ఎప్పుడైనా సోదాలు, ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఉంటుంది. అవసరమనుకుంటే కాల్పులు జరపొచ్చు. దీంట్లో సైనిక అధికారులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయడానికి అవకాశం లేదు.