రాంచీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) విమర్శించారు. ఆర్డినెన్స్ వివాదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తన మద్దతును ఆయన ప్రకటించారు. ఢిల్లీలో అధికారుల నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై సీఎం కేజ్రీవాల్ పోరాడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి జార్ఖండ్ సీఎం హేమత్ సోరెన్ను రాంచీలో శుక్రవారం కలిశారు. కేంద్రం ఆర్డినెన్స్ను పార్లమెంట్ ఎగువ సభలో అడ్డుకునేందుకు మద్దతు కోరారు.
కాగా, ఈ సందర్భంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నదని విమర్శించారు. దేశానికి బలమైన భిన్నత్వంలో ఏకత్వం కూడా కేంద్రం చర్యలతో దెబ్బతింటున్నదని ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వం సమాఖ్య నిర్మాణం గురించి మాట్లాడుతుంది. కానీ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షాలు కాని పార్టీలు కూడా దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నది ఈ రోజు స్పష్టమైంది. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని అన్నారు.
మరోవైపు బీజేపీ కేవలం ప్రతిపక్ష పార్టీలపైనే కాదు దేశ పౌరులపై కూడా దాడి చేస్తోందని హేమంత్ సోరెన్ మండిపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ గురించి తమ పార్టీలో చర్చిస్తామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
#WATCH | Ranchi | After meeting with Delhi CM Arvind Kejriwal over the Centre's Ordinance against Delhi Govt, Jharkhand CM Hemant Soren says, "…Central Govt speaks of federal structure but acts totally opposite. It is clear today that parties which are not the allies of the… pic.twitter.com/wuJA7q4Vax
— ANI (@ANI) June 2, 2023