న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల్లో దవాఖానల్లో చేరాల్సిన అవసరం 5 నుంచి 10 శాతం మందికే ఉంటుందని, అయితే ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో ఇది వేగంగా మారవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో హోం ఐసొలేషన్లో ఉంటున్న వారితో పాటు దవాఖానల్లో చేరుతున్న కరోనా బాధితుల సంఖ్యపై ప్రతిరోజూ దృష్టి సారించాలని రాష్ర్టాలను కోరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ర్టాలు, యూటీలకు సోమవారం లేఖ రాశారు. దవాఖానల్లో ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స తీసుకుంటున్న వారు, దవాఖానల్లో ఐసీయు బెడ్లు, వెంటిలేటర్ సదుపాయాలను కూడా ప్రతిరోజూ పరిశీలించాలని సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో దవాఖానల్లో చికిత్స అవసరమైన వారి సంఖ్య యాక్టివ్ కేసుల్లో 20-23 శాతం ఉండేదని పేర్కొన్నారు.
227 రోజుల గరిష్ఠానికి
దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. సోమవారం ఒక్కరోజే 1,79,723 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 227 రోజుల తర్వాత ఇదే అత్యధికం. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. ప్రస్తుతం 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 27 రాష్ర్టాల్లో 4,033 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 13.29 శాతంగా ఉంది. సోమవారం 146 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా 146 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,83,936కు పెరిగింది.
మొదలైన ముందు జాగ్రత్త డోసు పంపిణీ
ముందు జాగ్రత్త డోసు (ప్రికాషనరీ డోసు) పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 60 ఏండ్ల వయస్సు పైబడిన వారు మూడో డోసు వేసుకున్నారు. తొలి రోజు 9 లక్షల మందికిపైగా ప్రికాషన్ డోసు తీసుకున్నారు. 1.05 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, 1.9 కోట్ల మంది ఫ్రంట్లైన్ వారియర్లు, 2.75 కోట్ల మంది 60 ఏండ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఒమిక్రాన్ను తగ్గించేందుకు యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ మ్యాజిక్ మందేమీ కాదని ఎయిమ్స్ వైద్యుడు నీరజ్ నిశ్చల్ వ్యాఖ్యానించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకి మోస్తరు లక్షణాలు ఉన్న వారు చిన్నపాటి చికిత్సలతో ఇంటి నుంచే నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఢిల్లీలో దాదాపు వెయ్యి మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లు మూసివేశారు. టేక్ అవేకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
రాత్రి 10 వరకు వ్యాక్సినేషన్ కేంద్రాలు
కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్వహణకు ఎలాంటి కాల పరిమితి (టైం లిమిట్) లేదని కేంద్రం స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాల ఆధారంగా సెంటర్లను ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు నిర్వహించవచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని సోమవారం రాష్ర్టాలు, యూటీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉంటాయనే అభిప్రాయం ఉన్నదని, ఈ నేపథ్యంలో టైం లిమిట్ లేదని స్పష్టం చేస్తున్నామన్నారు. డిమాండ్, అవసరాలకు అనుగుణంగా ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సెషన్ టైమింగ్స్ ఉంటాయని తెలిపారు.