న్యూఢిల్లీ, అక్టోబర్ 29: చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం గత మే నెల నుంచి ఈ నెల వరకు చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పొడిగించింది.
ఈ ఏడాది రికార్డుస్థాయిలో చక్కెర ఉత్పత్తి అవుతుందని దాదాపు 80 లక్షల టన్నుల వరకు ఎగుమతికి అనుమతి ఇస్తారని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఆ మేరకు వ్యాపార వర్గాలు బేరాలు కూడా కుదుర్చుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లింది. 2021-22 సీజన్లో చక్కెర ఎగుమతి 57 శాతం పెరిగింది. దాదాపు 109.8 లక్షల టన్నుల ఎగుమతి ద్వారా దేశంలోకి రూ.40వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వచ్చింది.