1927 నాటి చట్టం నుండి పలు నేరాల తొలగింపు
చెట్ల నరికివేతకు ద్వారాలు తెరుస్తూ సవరణలు
న్యూఢిల్లీ, జూలై 12: అటవీ రక్షణను నీరుగార్చే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతున్నది. భారతీయ అటవీ చట్టం (1927)లోని పలు అంశాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించేందుకు నడుం కట్టింది. అడవిలో కలప రవాణా, పశువులు దూరడం, చెట్లను కొట్టివేయడం వంటివి ఇక ఎంతమాత్రం నేరాలు కాబోవు.
ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అడవిలో మంటపెట్టడం, చెట్టును కొట్టడం, కలపను తరలించడం వంటి నేరాలకు ఆరునెలల జైలు, లేదా రూ.500 జరిమానా లేదా రెండూ ఉండేవి. ఇప్పుడు రూ.500 జరిమానాతో సరి. ఈ సవరణల వల్ల యథేచ్ఛగా చెట్లు కొట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పర్యావరణ న్యాయవాది రిత్విక్ దత్తా అన్నారు. ఒక చెట్టు కొట్టినా లేదా యావత్తు అడవిని నరికినా ఒకటే జరిమానా (రూ.500) వేస్తారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 1927లో వచ్చిన ఈ చట్టాన్ని సవరించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నారు.