(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశంలో హెలికాప్టర్ సేవల్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ‘పవన్ హన్స్’. దీని వాటా విక్రయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. పవన్ హాన్స్ కోసం విజయవంతమైన బిడ్డర్గా నిలిచిన స్టార్9మొబిలిటీలో మెజార్టీ వాటా ఉన్న అల్మాస్ గ్లోబల్ అపర్చునిటీస్ ఫండ్ను అనర్హత కలిగిన కంపెనీగా తేలుస్తూ.. విక్రయ ప్రక్రియకు బ్రేకులు వేసింది. రూ. 4,898 కోట్ల విలువ చేసే పవన్ హాన్స్ను కేవలం రూ. 211.14 కోట్లకే అల్మాస్ కంపెనీకి మోదీ సర్కారు కట్టబెట్టింది.
దీనిపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రుణదాతలకు చెల్లింపులు చేయడంలో అల్మాస్ గ్లోబల్ విఫలమైందని ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) తేల్చింది. దీంతో గత ఏడాది మేలో విక్రయ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇంత జరిగినా..అల్మాస్పై అనర్హతవేటు పడలేదు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయంగా నష్టం జరుగుతుందన్న భయంతో కేంద్రం వెనుకడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.