న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను రెస్టారెంట్ల పరిధిలోకి తీసుకువచ్చి వాటిపై జీఎస్టీ విధించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై శుక్రవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నది. ఒక వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లపై జీఎస్టీ విధిస్తారు. ఫలితంగా రేట్లు పెరుగుతాయి. ఏడాదికి రూ.20 లక్షలు టర్నోవర్ దాటిన హోటళ్లు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. జీఎస్టీలో రిజిస్ట్రేషన్ అయిన హోటళ్లలో ఆర్డర్లపై ప్రస్తుతం రెస్టారెంట్ జీఎస్టీ విధిస్తున్నారు. అయితే, అనేక చిన్న చిన్న హోటళ్లు జీఎస్టీ పరిధిలో లేవు. ఫలితంగా ప్రభుత్వాలు ఏటా రూ.2వేల కోట్ల దాకా పన్ను రాబడిని నష్టపోతున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థను రెస్టారెంట్ల పరిధిలోకి తీసుకువచ్చి జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్కు చెందిన ఫిట్మెంట్ కమిటీ ప్రతిపాదించింది.