న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో మళ్లీ కొవిడ్ ఉద్ధృతి కలవరపెడుతున్నది. ఢిల్లీతో పాటు 12 రాష్ర్టాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. ఆదివారం కొత్తగా 2,541 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 16,522కి చేరింది. తాజా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ఫోర్త్ వేవ్ ఆందోళన నెలకొన్నది. టీకాలు అందుబాటులో ఉన్నా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.20 కోట్ల వ్యాక్సిన్ బుడ్డీలు (ఒక్కదానితో 10 డోసులు వేయొచ్చు) ఇంకా తమ వద్దనే మిగిలిపోవడంతో ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తాజాగా ప్రకటించింది. కొవాక్స్ కింద ఉచితంగా అందుబాటులో ఉన్న 10 కోట్ల డోసులు వాడుకోవాలని, వృథా అవుతాయని కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్పై తాత్సారం చేస్తున్న మోదీ సర్కారు నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. మొదటి, రెండో డోసుకు తీసుకున్న వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోసుగా వేరే వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుందని లాన్సెట్ పేర్కొన్నది.