న్యూఢిల్లీ : కర్నాటక సీఎం యడియూరప్పను మార్చి మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారానికి తెరపడటం లేదు. నాయకత్వ మార్పు ఉండబోదని పలువురు నేతలు పదేపదే చెబుతున్నా హైకమాండ్ ఆయనను మార్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసిందని ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. యడియూరప్ప పనితీరుపై అసమ్మతి నేతలు తరచూ ఫిర్యాదులో చేస్తుండటంతో ఆయనను తప్పించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుందని హైకమాండ్ కు సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
సీఎం పదవి నుంచి తప్పుకోవాలని యడియూరప్పను పార్టీ అగ్రనేతలు కోరినట్టు వెల్లడించాయి. మరోవైపు యడియూరప్ప సీఎంగా కొనసాగుతారని బీజేపీ కర్నాటక శాఖ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని యడియూరప్ప సారథ్యంలో కర్నాటక ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొందని, మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా పనిచేశారని కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ చెప్పారు. తాను త్వరలో బెంగళూర్ చేరుకుని అసమ్మతి నేతలతో మాట్లాడి సమస్యలు సర్ధుబాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
నాయకత్వ మార్పు వ్యవహారం, అసమ్మతి నేతల కట్టడిపై అరుణ్ సింగ్ ఓవైపు కసరత్తు సాగిస్తుండగానే యడియూరప్పను పాలనా పగ్గాల నుంచి తప్పించడంపై బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.