న్యూఢిల్లీ, మే 9: గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు సహా వేతన సంబంధిత నిబంధనలను ప్రామాణీకరించడంతోపాటు అధికారిక సామాజిక రక్షణను విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన కార్మిక సంస్కరణలైన వేతనాల కోడ్, 2019, సామాజిక భద్రత కోడ్, 2020 కింద కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కనీస వేతనాలు, వేతనాల చెల్లింపు, బోనస్, సమాన వేతనాలకు సబంధించిన నిబంధనలను ఒక చట్రం కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం శుక్రవారం వేతనాల కోడ్(కేంద్ర) నిబంధనలు, 2026ను నోటిఫై చేసింది.
29 కేంద్ర కార్మిక చట్టాలను ఏకీకృతం చేసే లక్ష్యంతో ఉన్న నాలుగు కార్మిక కోడ్ల అమలును కేంద్రం ముందుకు తీసుకువెళుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. వేతన నిబంధనలు 8 గంటల సాధారణ పని దినాన్ని నిర్దేశిస్తాయి. వారపు పని గంటలను 48 గంటలకు పరిమితం చేస్తాయి. కనీస వేతనాలను రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తారు.
అయితే గంటవారీ వేతనాన్ని ఎనిమిదితో భాగించడం ద్వారా, నెలవారీ వేతనాలను రోజువారీ వేతనాన్ని 26తో గుణించడం ద్వారా లెక్కిస్తారు. లేబర్ బ్యూరో ప్రచురించే వినియోగదారుల ధరల సూచీ డేటా ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1, అక్టోబర్ 1 తేదీలకు ముందు) వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్(వీడీఏ)ను సవరించాలని కేంద్రం ఆదేశించింది.