న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నేషనల్ డెంటల్ కమిషన్ (NDC) బిల్లు-2022ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డెంటిస్ట్స్ యాక్ట్-1948ను రద్దుచేసి దాని స్థానంలో నేషనల్ డెంటల్ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) నిర్వహిస్తున్న పాత్రనే NDC నిర్వహించనుంది.
రెండున్నరేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)ని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)గా మార్పు చేసింది. అదే విధానంలో ఇప్పుడు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI)ని నేషనల్ డెంటల్ కమిషన్ (NDC)గా మార్చాలని భావిస్తున్నది.