ఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేటురంగ సామర్థ్యాలను తీసుకువచ్చే క్రమంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ‘సెంట్రల్ రైల్సైడ్ వేర్హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్డబ్ల్యుసీ) కు చెందిన అన్ని ఆస్తులు, బాధ్యతలు, హక్కులను సెంట్రల్ వేర్హౌజింగ్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ)కు బదిలీ, విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
ఈ రెండింటి విలీనం నిర్ణయించిన ఎనిమిది నెలల్లోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, రవాణా, గిడ్డంగుల నిర్వహణ పరంగా ఇరు సంస్థల సారూప్య విధులను విలీనం ఏకీకృతం చేస్తుంది.
ఈ విలీనంతో కార్పొరేట్ కార్యాలయ అద్దె, ఉద్యోగుల జీతం, ఇతర పరిపాలనా వ్యయాల వల్ల రైల్సైడ్ వేర్హౌస్ కాంప్లెక్స్ల (ఆర్డబ్ల్యూసీ) నిర్వహణ వ్యయం రూ .5 కోట్లు తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం నిల్వ చేస్తున్న సిమెంట్, ఎరువులు, చక్కెర, ఉప్పు, సోడా వస్తువుల కంటే ఇతర వస్తువులను నిల్వ చేయడానికి సీడబ్ల్యూసీ కి అవకాశం ఉన్నందున ఆర్డబ్ల్యూసీ ల సామర్థ్య వినియోగం కూడా మెరుగుపడుతుందని అంచనా.