Sugar | ముంబై, సెప్టెంబర్ 5: దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో చక్కెర ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పంచదార ధరలు ఆరేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ పరిణామం దేశంలో ఇప్పటికే ఉన్న ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం మెట్రిక్ టన్ను చక్కెర ధర రూ.37,760గా ఉన్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అది 2017, అక్టోబర్ నెల నుంచి ధరల్లో గరిష్ఠమని తెలిపాయి. చక్కెర నిల్వలు పడిపోతున్న క్రమంలో రాబోవు పండుగ సీజన్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ముంబైకు చెందిన వ్యాపారి ఒకరు అంచనా వేశారు. దేశంలో చెరకు పండించే మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రధాన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. వచ్చే సీజన్లో పంట దిగుబడి తగ్గవచ్చుననే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో చక్కెరను తక్కువ ధరకు విక్రయించేందుకు మిల్లులు ఆసక్తి చూపడం లేదని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ పేర్కొన్నారు.
నిల్వలపై పరిమితులకు కేంద్రం యోచన!
హోల్సేలర్ల వద్ద చక్కెర నిల్వలపై పరిమితులు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై వచ్చే వారం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చక్కెర నిల్వలపై పరిమితులను చివరిసారిగా 2016లో విధించారు. కాగా, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నుంచి మిల్లులు చక్కెర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా నిషేధించే చాన్స్ ఉన్నదని గత వారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని రాయిటర్స్ పేర్కొన్నది. ఇదే జరిగితే, గత ఏడేండ్లలో చక్కెర ఎగుమతులను నిలిపివేయడం ఇదే మొదటిసారి అవుతుంది.