న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రభుత్వ సంస్థల అమ్మకం.. ఉద్యోగాల తొలగింపు.. పెట్రో ధరల పెంపు.. జీఎస్టీతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది కేంద్రంలోని మోదీ సర్కారు. సరే.. ఇంత చేసి ప్రజలకు పెడుతున్నదా? అంటే అదీ లేదు. అందుకు తాజాగా వెల్లడైన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2018-19లో ప్రజారోగ్యానికి కేంద్రం పెట్టిన ఖర్చు జీడీపీలో కేవలం 1.28 శాతం. 2017-18లో అది 1.35 శాతంగా ఉన్నది. ఈ లెక్కలు చెప్పింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ప్రజల ఆరోగ్యం పట్ల మోదీ సర్కారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో చెప్పటానికి ఇదే ఉదాహరణ. ప్రజల ఆరోగ్యానికి పెట్టాల్సిన ఖర్చును కేంద్రం ఏటేటా తగ్గిస్తూ పోతుంటే.. రాష్ర్టాలు మాత్రం భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఆరోగ్యానికి కేంద్రం పెట్టే మొత్తం ఖర్చు 2017-18లో 40.8 శాతంగా ఉండగా, 2018-19 నాటికి అది 34.3 శాతానికి తగ్గించింది. రాష్ర్టాలు 2017-18లో 59.2 శాతం ఖర్చు చేయగా, 2018-19లో 65.7 శాతానికి పెంచుకొన్నాయి.