‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దేశ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఇదీ. అయితే.. అధికారంలోకి వచ్చాక గత ఏడేండ్లలో కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షలే. లక్షలాది సంఖ్యలో ఇంకా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుండటంతో దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ భూతం తాండవం చేస్తున్నది. దీంతో నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. శంఖారావం పూరించారు. ‘రోజ్గార్ ఆందోళన్’ పేరుతో ఈ నెల 16న రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళన తలపెట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో రోజురోజుకు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ‘జాతీయ ఉద్యోగ విధానం(నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ)’ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దాదాపు 200లకు పైగా సంఘాలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఈ నెల 16న భారీ ఆందోళన చేపట్టనున్నాయి. సంయుక్త రోజ్గార్ ఆందోళన్ సమితి(ఎస్ఆర్ఏఎస్) నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమం జరుగనుంది. ఇందులో విద్యార్థి, యువజన సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఉపాధ్యాయ, మేధావుల సంఘాలు పాల్గొంటాయి. నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ తీసుకురావాలని, అదేవిధంగా ప్రజలకు ఎప్పటికప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టబద్ధం చేయాలన్న డిమాండుతో వారం రోజుల పాటు నిర్వహించనున్న రోజ్గార్ ఆందోళన్(ఉపాధి ఉద్యమం)లో భాగంగా 16న భారీ ఆందోళన చేపట్టనున్నారు. ఈ ఉపాధి ఉద్యమం ఈనెల 16 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రాధాన్య క్రమంలో వీటిని భర్తీ చేయాలని రోజ్గార్ ఆందోళన్ సూచించింది.
పీఎంవో నుంచి లేని స్పందన..
నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ‘దేశ్కీ బాత్ ఫౌండేషన్’ అనే మేథో సంస్థ ఓ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీని గతంలో రూపొందించింది. ఈ జాతీయ ఉద్యోగ విధానాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సంయుక్త రోజ్గార్ ఆందోళన్ గత ఏడాది డిసెంబర్ 20న సమర్పించింది. అయితే దీనిపై పీఎంవో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనబాట పట్టినట్టు ఎస్ఆర్ఏఎస్ సభ్యుడు, సెంట్రల్ కోఆర్డినేటర్ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని దేశంలోని నిరుద్యోగ సమస్యకు ఈ పాలసీలో దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. రోజ్గార్ ఆందోళన్లో వేలాది సంఖ్యలో విద్యార్థులు, యువకులు, కార్మికులు, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొంటారని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యోగ విధానం తీసుకురావాలని లేదా దేశ్కీ బాత్ ఫౌండేషన్ రూపొందించిన పాలసీలో తగిన మార్పులు, చేర్పులతో పార్లమెంట్లో ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘10ఎం’ ఫార్ములాతో పరిష్కారం!
కొవిడ్ సంక్షోభం అనంతరం దేశంలో నిరుద్యోగం మరింత తీవ్రరూపం దాల్చిందని, దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని దేశ్కీ బాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఫౌండేషన్ రూపొందించిన నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీని ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు, రిసెర్చ్ స్కాలర్లు, నిపుణులతో కూడిన బృందం తయారు చేసిందని చెప్పారు. ‘10 ఎం’ ఫార్ములాతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపొచ్చని ఈ పాలసీ చెబుతున్నదని పేర్కొన్నారు. మినీ టెక్నాలజీ, మినీ మార్కెట్లు, మల్లీనేషనల్ సైప్లె చైన్ను సృష్టించడంతో పాటు మినిమమ్ క్రెడిట్ సపోర్టు, నైపుణ్య శిక్షణ వంటివి ఈ 10 ఎం ఫార్ములాలో ఉన్నాయని తెలిపారు. ఇంకా చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమల్లో తయారీని మెరుగుపరచడం, పంటలకు కనీస మద్దతు కల్పించడం, కనీస ఆర్థిక మద్దతు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, కార్మికులకు సామాజిక భద్రత కల్పిచడంతో పాటు ఆధునిక, సంప్రదాయ సేవలను విస్తరించడం వంటి అంశాల్లో ఇందులో ఉన్నాయని వివరించారు.
జనాభా సమస్యేమీ కాదు!
అధిక జనాభా కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేమని పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వాదనలను దేశ్కీ బాత్ ఫౌండేషన్ పాలసీ ముసాయిదా ఖండించింది. సరైన ఆర్థిక విధానాలను పాటిస్తే అధిక జనాభా అనేది ప్రతికూల అంశంగా కాకుండా, వరంగా ఉపయోపడుతుందని పేర్కొన్నది. ఉదాహరణకు చైనా జనాభా దాదాపు 143 కోట్లుగా ఉన్నది. అయితే ఇదే సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే ఐదు రెట్లు పెద్దదని తెలిపింది.