Lok Sabha Elections | ధన బలం, కండబలం నియంత్రణ మందున్న అతిపెద్ద సవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్లో చూడవచ్చన్నారు. అభ్యర్థి వివరాలు ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చని.. అభ్యర్థిపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు యాప్లో ఉంటాయన్నారు. తాయిలాలు, నగదు పంపణీ జరిగితే ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. మీ సెల్ఫోన్ లోకేషన్ను బట్టి మీ ప్రాంతానికి 100 నిమిషాల్లో చేరుకుంటామని తెలిపారు. ప్రచారం, పోలింగ్ అవాంఛనీయ ఘటనల నియంత్రణ బాధ్యత మాపై ఉందన్నారు.
పోలింగ్ రోజు నిరంతరం సమాచారం తెలుసుకుంటామన్నారు. సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950, గ్రీవెల్ పోర్టల్ ద్వారా సమాచార సేకరణ ఉంటుందన్నారు. ఐదు మాధ్యమాల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారి ఉంటారన్నారు. రాష్ట్రాల మధ్య అనధికార వస్తువులు, డబ్బు రవాణా జరుకుండా గట్టి నిఘా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ డ్రోన్ సాయంతో నిఘా ఉంటుందని, డిజిటల్ పేమెంట్స్ నిరోధించేందుకు బ్యాంకుల నగదు నిల్వల డిమాండ్పై వేస్తామన్నారు. ఎన్నికల్లో హింసకు చోటు ఉండకూడదని ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. ఈ సారి కొత్త ప్రయోగం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నారు.
టీవీ, సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950 హెల్ప్లైన్, ఫిర్యాదు పోర్టల్ ఉంటాయన్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక అధికారిని అలాంటి కంట్రోల్ రూమ్లో నియమిస్తామన్నారు. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వారిపై, హిస్టరీ షీటర్లుగా ఉన్న వారిపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటామన్నారు. మూడేళ్లుగా ఏదైనా ఒక జిల్లాలో పోస్టింగ్ పొందిన మార్చాలని కోరామన్నారు. వలంటీర్లు, కాంట్రాక్టుపై పనిచేస్తున్న చోట వారిని ఎన్నికల విధులకు వినియోగించమన్నారు. కొన్ని రాష్ట్రాల్లో డబ్బు వినియోగం ఎక్కువగా ఉందని.. దీనిపై దృష్టి సారించామన్నారు. గత 11 ఎన్నికల్లో రూ.3,400 కోట్ల నగదు అక్రమ వినియోగాన్ని నిరోధించామన్నారు. 2017-18తో పోలిస్తే 2022-23లో 835 శాతం పెరుగుదల నమోదైందన్నారు. మద్యం, నగదు పంపిణీ, కుక్కర్లు, చీరలు తదితర తాయిలాల పంపిణీ కట్టడికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
బ్యాంకుల్లో నగదు డిమాండ్పై దృష్టి సారిస్తారన్నారు. ప్రతి ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రోడ్డు మార్గాలపై గట్టి నిఘా ఉంటుంది. హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాల్లోనూ మానిటరింగ్ చేస్తారన్నారు. ఎన్నికల కమిషన్తో సహా ఎవరినైనా విమర్శించే పూర్తి స్వేచ్ఛ ఉందని, అయితే తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేసే స్వేచ్ఛ లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యంతరకర ప్రకటనలతో కూడిన పోస్టులను తొలగించమని అడిగే అధికారం ప్రతి రాష్ట్రంలోని అధికారులకు ఇవ్వబడిందని.. ఎవరైనా తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తే, తీవ్రంగా పోరాడుతామన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ‘లైస్ వర్సెస్ రియాలిటీ’ పేరుతో సిరీస్ ప్రారంభం కానుంది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని గుడ్డిగా అనుసరించవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.