న్యూఢిల్లీ: దేశ వీరుడికి జనం వందనాలు పలికారు. భరత భూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీలో కామ్రాజ్మార్గ్లోని తన నివాసం నుంచి బ్రార్ స్క్వేర్లోని శ్మశానవాటిక వరకు జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర కొనసాగింది. వీర నాయకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా హాజరయ్యారు. పార్దీవదేహాంతో వెళ్తున్న వాహనంపై జనం పూవ్వులు కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట పరుగులు తీశారు.
సేన ఆధునీకరణ కోసం అంతిమ క్షణాల వరకు జీవితాన్ని అర్పించిన బిపిన్ రావత్కు ఘన వీడ్కోలు లభించాయి. రోడ్డుకు ఇరువైపుల నిలబడ్డ జనం.. పువ్వులు కురిపిస్తూ.. త్రివర్ణ జెండాలను ఊపుతూ తమ దేశభక్తిని చాటారు. వీర సైనికుడు బిపిన్ రావత్ అంతిమయాత్రలో.. ఇండియన్ ఆర్మీ జిందాబాద్.. వందేమాతరం అంటూ నినాదాలు కూడా మారుమోగాయి.
వ్యూహాలు, ప్రణాళికలతో శత్రువుల గుండెల్లో దడపుట్టించిన బిపిన్ రావత్.. ఈ లోకాన్ని అనూహ్యంగా విడిచి వెళ్లారు. బుధవారం తమిళనాడులో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో బిపిన్ రావత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.