లక్నో, జూన్ 18: రామ మందిర విరాళాల్లో అవకతవకలు, అక్రమాలపై ‘సిట్’ దర్యాప్తు వేగవంతమైంది. ఆలయంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్ను తారుమారు (ట్యాంపరింగ్) చేశారనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. సిట్ పరిశీలించిన పత్రాల ప్రకారం, గత 11 నెలల్లో ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా విరాళాల పెట్టెల నుండి నగదు, ఆభరణాలు చోరీకి గురికావటాన్ని ‘సిట్’ సీరియస్గా పరిశీలిస్తున్నది. సీసీటీవీ కెమెరా నెట్వర్క్ను నిర్వహిస్తున్న సిబ్బందిని ‘సిట్’ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ నిమిత్తం దాదాపు 200 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు నిఘా వ్యవస్థలు, రికార్డ్ అయిన ఫుటేజీ, భద్రతా నిర్వహణ విధానాలను నిశితంగా పరిశీలించారు. రమాశంకర్ యాదవ్ (తిన్ను యాదవ్)ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. భద్రతా వ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఏవైనా లోపాలు, కుమ్మక్కు జరిగిందా? అనే కోణంలో విచారణ సాగుతున్నది. కొంతమంది సిబ్బంది సర్వీస్ రికార్డులు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు.