న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక చనిపోయారు. ఎయిర్ కండీషనర్ పేలి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ధనేంద్ర కుమార్ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కుమార్ ఇంటికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
కుమార్ కొడుకుకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వేసవిలో ఎయిర్ కండీషనర్ల వినియోగం ఎక్కువగా ఉన్న వేళ ఈ తరహా ప్రమాదం జరగడం విద్యుత్తు వ్యవస్థ భద్రత, విద్యుత్తు ఉపకరణాల నిర్వహణపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.