న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్ 2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను త్వరలో వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రకటించింది. టర్మ్ 2 బోర్డు పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్ను గత నెలలోనే వెబ్సైట్లో పొందుపర్చింది.
కాగా, కరోనా నేపథ్యంలో 10, 12 తరగతులకు బోర్డు పరీక్షల విధానాన్ని సీబీఎస్ఈ తొలిసారి మార్చింది. ఈ విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించింది. ఇందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం గత ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్యలో టర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించింది. టర్మ్1 పేపర్లలో ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. అయితే వీటి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు.