న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: 10, 12 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్ట్ల విషయంలో కీలక మార్పులు చేసేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిద్ధమవుతున్నది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొన్నది. ఈ ప్రతిపాదిత మార్పుల ప్రకారం సీబీఎస్ఈ 10వ తరగతిలో విద్యార్థులు ప్రస్తుతం రెండు భాషా సబ్జెక్ట్లు చదువుకొంటుండగా.. వాటిని మూడు భాషలకు పెంచనున్నారు.
అందులోనూ కనీసం రెండు భాషలు తప్పనిసరిగా భారతీయ స్థానిక భాషలు ఉండాలనే నిబంధన పెట్టనున్నది. వీటితో పాటుగా మరో ఏడు సబ్జెక్ట్లు(మ్యాథ్మ్యాటిక్స్ అండ్ కాంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్సెస్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్) ఉంటాయి.
ఈ మేరకు ఉత్తీర్ణతా ప్రమాణాల్లో విషయంలోనూ ప్రతిపాదనలు చేసింది. దీంతో 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడున్న ఐదు సబ్జెక్ట్లకు బదులు మూడు భాషలు, ఏడు సబ్జెక్ట్లతో కలిపి మొత్తం 10 సబ్జెక్ట్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే 12వ తరగతికి సంబంధించి చేసిన ప్రతిపాదనలు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఒక భాష సబ్జెక్ట్ను రెండు భాషా సబ్జెక్ట్లకు పెంచారు. ఇందులో కనీసం ఒకటి తప్పనిసరిగా భారతీయ భాష అయి ఉండాలి. మొత్తంగా విద్యార్థులు హైస్కూల్ విద్యను పూర్తి చేయాలంటే ఐదుకు బదులు ఇప్పుడు ఆరు సబ్జెక్ట్లలో ఉత్తీర్ణత అవ్వాల్సి ఉంటుంది.