న్యూఢిల్లీ, జూలై 21: 12వ తరగతి విద్యార్థుల మార్కుల మదింపు గడువును సీబీఎస్ఈ మూడు రోజులు పొడిగించింది. మార్కులను పంపేందుకు పాఠశాలలకు ఆదివారం దాకా వెసులుబాటు కల్పించింది. తొలుత గడువు గురువారం వరకే ఉంది. అయితే చాలా పాఠశాలలో మార్కుల మదింపు కొలిక్కి రాలేదు. డెడ్లైన్ ముగుస్తుండటంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో గడువును మరో మూడు రోజులు అంటే ఆదివారానికి(25వ తేదీ) పొడిగించింది. ఈ గడువు లోపల కూడా ఏదైనా పాఠశాల మార్కులు పంపకపోతే ఆ పాఠశాలలోని విద్యార్థుల ఫలితాలను ప్రత్యేకంగా ప్రకటిస్తామని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితాలను జూలై 31లోగా ప్రకటిస్తామని సీబీఎస్ఈ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా, 10,12వ తరగతుల బోర్డు పరీక్షలకు ప్రైవేటుగా ఫీజు కట్టిన విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 15వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నది. విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులో చేరడానికి ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ చెప్పారు.