ముంబై: లీకైన నీట్ గెస్ పేపర్ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక క్లాసులు నిర్వహించి నీట్ గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. (NEET leak) మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టైన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణేకు చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, ఆర్సీసీ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ మోటెగావ్కర్తో పరిచయం ఉన్నది. ఈ నేపథ్యంలో తన మేనల్లుడు, మేనకోడలు కోసం నీట్ గెస్ పేపర్ను ఆయన కొనుగోలు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో గురువారం లాతూర్లో డాక్టర్ మనోజ్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూణేలోని తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ను ప్రకటించనున్నారు.
కాగా, నీట్ పరీక్షకు కొన్ని రోజుల ముందు డాక్టర్ మనోజ్కు చెందిన లాతూర్లోని ఆసుపత్రిలో పీవీ కులకర్ణి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. ఆర్సీసీ క్లాసెస్ డైరెక్టర్ శివరాజ్ కుమారుడు కూడా ఈ క్లాస్లకు హాజరైనట్లు పేర్కొంది. ఈ ఆసుపత్రిలోనే నీట్ గెస్ పేర్ లీకైనట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో శివరాజ్ కుమారుడు, డాక్టర్ మనోజ్ మేనకోడలు, మేనల్లుడిని కూడా సీబీఐ అధికారులు విడివిడిగా ప్రశ్నించారు.
మరోవైపు నీట్ పరీక్షకు ముందు కుమార్తె కోసం లీకైన ప్రశ్నాపత్రాన్ని రూ. 5 లక్షలకు కొనుగోలు చేసినట్లు భావురావు కదమ్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాందేడ్లోని ఆ నివాసంపై సీబీఐ రైడ్ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన సోదాల్లో కీలక పత్రాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. భావురావు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. తదుపరి విచారణ కోసం పుణెలోని తమ కార్యాలయానికి రావాలని భావురావు, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ ఆదేశించింది.
అయితే మే 3న నీట్ ఎగ్జామ్ను నిర్వహించగా పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఆ పరీక్షను ఎన్డీఏ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్లో పూణె, లాతూర్, నాందేడ్ వ్యక్తుల మధ్య సంబంధాలను సీబీఐ పరిశీలిస్తున్నది. నీట్ లీక్ పేపర్ను ఎంత మంది తల్లిదండ్రులు , ఎంతెంతకు కొనుగోలు చేశారు అన్నది దర్యాప్తు చేస్తున్నది.