న్యూఢిల్లీ, మే 29: బ్రిటన్కు చెందిన రక్షణ రంగ కంపెనీ రోల్స్ రాయిస్ పీఎల్సీపై సీబీఐ కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతి చేసి భారత్ను మోసం చేశారనే అభియోగాలపై ఆ కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు, ఆయుధ డీలర్లపై కేసు నమోదైంది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్తో పాటు ఆయుధ డీలర్లు సుధీర్ చౌదరీ, భాను చౌదరీలపై నేరపూరిత కుట్రలకు సంబంధించిన సెక్షన్ 120-బీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 2003లో రూ.5653.44 కోట్ల విలువైన 66 హాక్ 115 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ విమానాలను వాయుసేన సమకూర్చుకునేందుకు క్యాబినెట్ అనుమతులిచ్చింది. వీటిలో రోల్స్ రాయిస్ 24 విమానాలను అందించే విధంగా, మిగతా 42 హెచ్ఏఎల్ భాగస్వామ్యంతో తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడి మధ్యవర్తులకు ముడుపులు చెల్లించి 24 హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ విమానాలను భారత్కు అందించేలా ఒప్పందం చేసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. అనంతరం ఒప్పందాన్ని ఉల్లంఘించి రోల్స్ రాయిస్ మెటీరియల్ సమకూర్చగా హెచ్ఏఎల్కు 42 ఎయిర్క్రాఫ్ట్ల తయారీకి అనుమతి ఇచ్చినట్టు సీబీఐ తెలిపింది. హెచ్ఏఎల్ తయారీకి సంబంధించి లైసెన్సు ఫీజును కూడా భారీగా పెంచి చెల్లింపులు జరిపినట్టు సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి 2006-07లో ఐటీ శాఖ సోదాలు చేయగా, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నది. అయితే ఆ డాక్యుమెంట్లు రక్షణ శాఖ చేతికి చిక్కకుండా ఉండేందుకు సైతం భారీగా ముడుపులు చేతులు మారినట్టు సీబీఐ గుర్తించింది.