(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): వీధిపశువుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికల ముందర ఊదరగొట్టిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇప్పుడు ఆ ఊసే మరిచింది. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీధి పశువుల బెడద.. అన్నదాతల ఉసురుతీస్తున్నది. గ్రాసం లేక వీధి పశువులు పొలాలపై పడుతున్నాయి. దీంతో రాత్రిళ్ళు పొలాలకు కాపలా కాస్తూ, చలికి తట్టుకోలేక రైతులు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
తీగల కంచెపై నిషేధం
యూపీలో పొలాలకు తీగల కంచె వేయడం నిషేధించారు. వీధి పశువుల పోషణకు ప్రారంభించిన గో సంరక్షణ దత్తత పథకానికి సరిగా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ పశువులు మూకుమ్మడిగా పొలాలపై పడి పంటను నాశనం చేస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశువుల సమస్య లేకుంటే తన భర్త చనిపోయేవాడు కాదని రైతు సత్యపాల్ భార్య శ్యామా దేవి వాపోయారు. 2019 సర్వే ప్రకారం యూపీలో 11.84 లక్షల వీధి పశువులున్నాయి. ఒక్కో పశువు పోషణకు ఏడాదికి రూ.3720 చెల్లిస్తారు.
ఆత్మహత్యలకూ కారణమవుతున్నాయి!
బుందేల్ ఖండ్ ప్రాంతంలో వీధి పశువుల సమస్య విపరీతంగా ఉంది. దీని వల్ల పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వట్టి పోయిన ఆవులు, వీధి పశువుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి పశువుల సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేశాయి. కాని వాటిని పూర్తిగా అమలు చేయడానికి చిత్తశుధ్ధితో ప్రయత్నించటం లేదు.
– ప్రైమ్ సింగ్, రైతు ప్రతినిధి