న్యూఢిల్లీ, నవంబర్ 28: కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ను తయారు చేసేందుకు జోధ్పూర్ ఐఐటీ పరిశోధకులు నానోకంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు. పేటెంట్ హక్కులు పొందిన ఈ పద్ధతిలో వీరు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా మార్చేందుకు సహజ సూర్యకాంతిని ఉపయోగించారు. ఈ ప్రక్రియను కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియగా పిలుస్తారని, ప్రకృతి సిద్ధంగా మొక్కల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ ఇలాగే జరుగుతుందని ఐఐటీ జోధ్పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ రాకేశ్ కే శర్మ తెలిపారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించేందుకు మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొంటాయని, ఆ తర్వాత కార్బన్డయాక్సైడ్తో చర్య జరిపి కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయని వివరించారు. తాము రూపొందించిన ఉత్ప్రేరకం కూడా కృత్రిమ పద్ధతిలో ఇదేవిధంగా హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ పరిస్థితుల్లో సమర్థంగా హైడ్రోజన్ను తయారు చేయగలిగే పలు ఉత్ప్రేరకాలను జోధ్పూర్ ఐఐటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిందని, పరిశ్రమలు, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలకు ఇవి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు తెలిపారు.