జైపూర్: ముగ్గురు పోలీసులు ఒక యువతిపై ఏడాదిగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేశారు. (Case Against Police) రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్లో తాను మైనర్గా ఉన్నప్పుడు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ తొలుత అత్యాచారం చేశారని 18 ఏళ్ల యువతి తెలిపింది. నాటి నుంచి ఏడాదిగా తనపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన సోదరుడిపై తప్పుడు కేసు నమోదు చేస్తామని ఆ పోలీసులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, అల్వార్ జిల్లా ఎస్పీ ఆనంద్ శర్మ ఈ సంఘటనపై వెంటనే స్పందించారు. నిందితులైన ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ రాయిని పోలీస్ స్టేషన్లో, రాజ్గఢ్ సర్కిల్ ఆఫీసర్ కార్యాలయంలో, మలఖేడా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిని పోలీస్ లైన్స్కు అటాచ్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు సామూహిక లైంగికదాడి వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.