తిరువనంతపురం: కేరళలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం గ్రామీణ ప్రాంతంలో భారీ వానలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఒక కారు కొట్టుకుపోతుండగా, నడుంలోతు నీటిలో దిగిన స్థానికులు తాడు సహాయంతో ఆ కారును పక్కకు లాగారు. అలాగే పూంజార్లో కేఎస్ఆర్టీసీ బస్సు వర్షం నీటిలో చిక్కుకున్నది. దీంతో అందులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, తిరువనంతపురం, కొల్లామ్, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరో రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా, ప్రజలు అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావద్దని, కొండలు, నదీ ప్రవాహాల వద్ద వాహన ప్రయాణాలు వద్దని సీఎం విజయన్ సూచించారు.