ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తున్నారు. కులం, మతం అన్న గోడలను దాటి.. పంజాబ్ ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. పంజాబియత్ స్ఫూర్తిని చాటారు’ అంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్లో పేర్కొన్నారు.
పంజాబ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పాటియాలా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్… ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. చాలా కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన అమరీందర్ సింగ్… ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కాంగ్రెస్ను వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీని తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా… చివరికి సొంత పార్టీ పెట్టుకొని.. పరాజయం మూటగట్టుకున్నారు.