డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ప్రజలకు ఊరట లభించింది. సుమారు 50,000 మంది ప్రజలను రాత్రికి రాత్రే అక్కడి నుంచి ఖాళీ చేయించడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్రమిత రైల్వే స్థలంలో అక్రమ ఇళ్లను తొలగించడాన్ని సమర్థిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఏడు రోజుల్లో 50,000 మందిని అక్కడి నుంచి తొలగించడం సరికాదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో చాలా కోణాలు ఉన్నాయని, ప్రజలు ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని పేర్కొంది. ‘ఏడు రోజుల్లో క్లియర్ చేయమని మీరు ఎలా చెబుతారు?’ అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. రైల్వే స్థలం ఆక్రమణల సమస్యను తగిన విధంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అక్కడ నివసిస్తున్న వారికి పూర్తిగా పునరావాసం కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆక్రమిత రైల్వే స్థలంలో కొత్త నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
కాగా, ఉత్తరాఖండ్ హల్ద్వానీలో సుమారు 29 ఎకరాల రైల్వే భూమిని వేలాది మంది ఆక్రయించారు. ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు ప్రభుత్వ స్కూళ్లు, 11 ప్రైవేట్ స్కూళ్లు, ఒక బ్యాంక్, రెండు వాటర్ ట్యాంకులు, పది మసీదులు, నాలుగు గుళ్లు, పలు షాపులు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై రైల్వేకు అనుకూలంగా ఉత్తరాఖండ్ హైకోర్టు డిసెంబర్ 20న తీర్పు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి వారంలోగా ఆక్రమణలను తొలగించాలని రైల్వే, స్థానిక అధికారులను ఆదేశించింది.
దీంతో రెండు కిలోమీటర్ల పరిధిలోని రైల్వే స్థలంలో ఉన్న బంభుల్పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాలను అక్రమ నివాసితులు ఈ నెల 9లోగా ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. లేకపోతే ఈ నెల 10 నుంచి ఇళ్ల కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడి నివాసితులు నిరసనలు చేపట్టారు. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వారికి ఊరట లభించింది.