న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. తొలి డోసు టీకా తీసుకున్న వారికి, అదే కంపెనీ రెండో డోసు వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రెండో డోసులో మరో కంపెనీ టీకాను వేసుకోవచ్చా? వేసుకుంటే ఏమవుతుంది? అనే చర్చ సాగుతున్నది. రెండు వేర్వేరు డోసులు తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. అవి అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ, రెండు వేర్వేరు డోసులు తీసుకోకపోవడమే ఉత్తమమని చెప్తున్నారు. టీకాల మిక్సింగ్కు సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేశారు. ఈ వివరాలు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. రెండు డోసుల్లో రెండు ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్లు ఇచ్చిన వలంటీర్లలో 34-41 శాతం మందిలో చలి జ్వరం, అలసట, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ను గమనించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండు డోసుల్లో ఒకే కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చిన వలంటీర్లలో 10 శాతం మందిలోనే సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించినట్టు తెలిపారు. పరిశోధనలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లు వినియోగించినట్టు పేర్కొన్నారు. కాగా, రెండు డోసుల్లో ఒకే కంపెనీ వ్యాక్సిన్ను మాత్రమే తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఇదిలాఉండగా, మహారాష్ట్రలో 72 ఏండ్ల దత్తాత్రేయ వాఘ్మారే అనే వృద్ధుడికి మొదటి డోసులో కొవాగ్జిన్ వేయగా, రెండో డోసులో పొరపాటున కొవిషీల్డ్ వేశారు. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.