Tamil Politics : టీవీకే చీఫ్ విజయ్ (TVK chief Vijay) మరోసారి లోక్భవన్ (Lok Bhavan) కు వెళ్లి గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ (Rajendra Viswanath Arlekar) ను కలిశారు. తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అసెంబ్లీ (Assembly) లో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విజయ్కు గవర్నర్ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. బుధవారం సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా..? మెజార్టీ మార్క్ 118 అయినప్పుడు 113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు..? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏవైనా ముందుకు వచ్చాయా..? అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా గవర్నర్కు విజయ్ వెల్లడించినట్లు తెలిపాయి.
అనంతరం విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వీరి భేటీ జరిగింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో నిన్న గవర్నర్తో టీవీకే చీఫ్ భేటీ కాగా సంఖ్యాబలంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. 118 మంది సభ్యులు (మెజార్టీ మార్క్) సమకూరిన తర్వాతనే తన దగ్గరికి రావాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే (Viduthalai Chiruthaigal Katchi) కూడా గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా.. ఇంకా అధికారికంగా చెప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ముందుగా టీవీకేకు అవకాశం ఇవ్వాలని డీఎంకే కూడా అభిప్రాయం వ్యక్తంచేసింది. కాగా.. ప్రొటోకాల్ ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రికి అందించే పోలీసు కాన్వాయ్ను విజయ్ నిరాకరించారు. ప్రమాణస్వీకారానికి ముందే ఆ ఏర్పాటు తనకు వద్దని విజయ్ చెప్పినట్లు టీవీకే వెల్లడించింది. అయితే టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొనడంతో కాన్వాయ్ను వెనక్కి తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ప్రొటోకాల్ ప్రకారం అందించిన సీఎం కాన్వాయ్ వాహనాలను విజయ్ వద్దన్నారని, తాము వెనక్కి తీసుకోలేదని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.