Lok Sabha Elections | లక్నో, మే 23: దేశంలోనే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరం దాదాపుగా తుది అంకానికి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు విడతల్లో 53 స్థానాలకు పోలింగ్ ముగియగా మరో 27 స్థానాలకు ఆరు, ఏడో దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 25 నాడు ఆరో దశలో భాగంగా 14 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పూర్వాంచల్ ప్రాంతంలోని సుల్తాన్పూర్, ప్రతాప్గఢ్, ఫూల్పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, దొమరియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్గంజ్, అజాంగఢ్, జాన్పూర్, మచ్చిలీషహర్, బదో హి స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పూర్వాంచల్లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వాంచల్లో సమాజ్వాదీ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఆరో దశలో ఎన్నికలు జరుగుతున్న 14 లోక్సభ స్థానాల పరిధిలో 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఎస్పీ ఏకంగా 34 స్థానాలను గెలుచుకొని బీజేపీకి బలమైన పోటీ ఇచ్చింది. ముఖ్యంగా అంబేద్కర్నగర్, లాల్గంజ్, ఆజంగఢ్ లోక్సభ నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను సమాజ్వాదీ గెలుచుకొని క్లీన్స్వీప్ చేసింది. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి పూర్వాంచల్లోని మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎస్పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా, ఆజంగఢ్ నియోజకవర్గాన్ని ఎస్పీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2019లో ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, 2022 ఉపఎన్నికలో మాత్రం ఎస్పీ అభ్యర్థిని బీజేపీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో ఓడించింది. దీంతో మరోసారి తమ కంచుకోటను గెలుచుకోవాలని ఎస్పీ కంకణం కట్టుకుంది. సమాజ్వాదీ పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న యాదవ, ముస్లిం ఓట్లను పదిలపరుచుకొని దళిత, ఓబీసీ ఓట్లను ఆకర్షిస్తే ఇక్కడ గెలుపు సులభమే అని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది.
2019 లోక్సభ ఎన్నికల్లో పూర్వాంచల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఎస్పీ – బీఎస్పీ కూటమి ఇక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో యూపీ మొత్తంలో బీజేపీ కేవలం 16 స్థానాల్లోనే ఓడిపోగా, వీటిల్లో ఐదు స్థానాలు ఇప్పుడు ఆరో విడతలో పోలింగ్ జరుగుతున్న 14 స్థానాల్లోనివే. ఈ 14 నియోజకవర్గాల్లో బీజేపీ తొమ్మిది, బీఎస్పీ మూడు, ఎస్పీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మచ్చిలీషహర్ స్థానాన్ని కేవలం 181 ఓట్లతో బీజేపీ గెలుచుకుంది. ఈసారి పూర్వాంచల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించే ఓబీసీ ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. స్వామి ప్రసాద్ మౌర్య, అప్నాదళ్(ఎస్) అధినేత్రి అనుప్రియా పటేల్ వంటి ఓబీసీ నేతల ద్వారా ఆ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
గత లోక్సభ ఎన్నికల్లో పూర్వాంచల్లో బీఎస్పీ కొంత మెరుగైన ఫలితాలనే సాధించింది. ఆరో దశలో పోలింగ్ జరుగుతున్న 14 స్థానాల్లో బీఎస్పీ 10 స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాలను గెలుచుకుంది. మరో రెండు స్థానాలను స్వల్ప తేడాతో కోల్పోయింది. బీఎస్పీకి ఇక్కడ బలమైన ఓటుబ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కూడా పూర్వాంచల్పై చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా, దొమరియాగంజ్లో ఖ్వాజా షంషుద్దిన్, జాన్పూర్లో శ్రీకళారెడ్డి బీఎస్పీ తరపున బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ – బీఎస్పీ పొత్తు వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. ఓబీసీ ఓట్లను కూడా ఈ కూటమి బాగా ఆకర్షించింది. ఈసారి బీఎస్పీ విడిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్తో కలిసి ఎస్పీ బరిలో ఉంది. దీంతో ఇక్కడ నెలకొన్న త్రిముఖ పోటీ తమకే మేలు చేస్తుందని బీజేపీ భావిస్తున్నది.